‘దేవుడు చేసిన మనుషులు’ తొలిషాట్‌..

రవితేజ, పూరిజగన్నాథ్ కాంబినేషన్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. రవితేజ దేవుని పటాలకు నమస్కరించడాన్ని తొలిషాట్‌గా చిత్రీకరించారు. ఈ దృశ్యానికి సహ నిర్మాత బోగవల్లి బాపినీడు కెమెరా స్విచాన్ చేయగా, వీవీవినాయక్ క్లాప్ ఇచ్చారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ -‘‘పూరీ కాంబినేషన్‌లో ఇది నా అయిదవ సినిమా. కథ వినగానే ఉద్వేగానికి లోనయ్యాను.

ఎప్పుడెప్పుడు ఈ పాత్ర చేస్తానా అని ఇన్నాళ్లూ ఆత్రుతగా ఎదురుచూశా. మా ఇద్దరి నుంచి రానున్న మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు. ‘‘‘దేవుడున్నాడని మనస్ఫూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి’ అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. వందశాతం ప్రేక్షకులను అలరించే సినిమా ఇది’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ ‘ఇడియట్’ నుంచి రవితేజ, పూరీ కాంబినేషన్‌లో సినిమా తీయాలని కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరింది.

‘ఇడియట్’ రేంజ్ హిట్ అవుతుంది. మార్చి 2నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం. జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: కుంచె రఘు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

0 comments:

Post a Comment